Pages

Search This Blog


Thursday, August 4, 2011

గీత రచయిత జూనియర్ 'సముద్రాల'

తెలుగు చలనచిత్ర సాహిత్య కళామతల్లిని, నవ్యమైన, రసవంతమైన, నందనవనాలలో, పూబాటలందు నడిపించిన రచయిత సినీ కవికులపతి, సినీ భీష్ములు, శ్రీమాన్ సముద్రాల వెంకటరాఘవాచార్యులు ( సముద్రాల సీనియర్‌ ) కుమారుడే ఈ జూనియర్‌ సముద్రాల.

అందమె ఆనందం
అందమె ఆనందం
ఆనందమే జీవిత మకరందం!
...
ఆయన రాసిన మొట్టమొదటి పాటే పాపులర్‌ అయింది. ఆయనే సముద్రాల జూనియర్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత. " బ్రతుకు తెరువు సినిమా వచ్చింది, నాకు బతుకు తెరువు నిచ్చింది" అంటూ ఈ గీత రచయిత సముద్రాల జూనియర్ చెప్పుకునే వారట. ఆయన అసలు పేరు సముద్రాల రామానుజాచార్యులు.

తండ్రి బాటలోనే సాగుతూ సినీరంగంలో స్థిరపడాలని రామానుజాచార్య చిన్ననాటనే నిర్ణయానికొచ్చారు. వీరిది పండితవంశం. ఆంధ్ర, సంస్కృతాలు కరతలామలకం. తెనుగు ఛందస్సు, వ్యాకరణం జన్మసంస్కారంగా అబ్బాయికి అబ్బేశాయి. కవిత్వాంశతో పుట్టారు. అద్భుతమైన పద్యాలు రాసేవారు.

చెన్నై వాహినీ స్టూడియో శబ్దశాఖలో రికార్డిస్టుగా తొలినాళ్ళలో రామానుజం పనిచేశారు. ఆ ఉద్యోగం వదిలిపెట్టి, వెండితెరపై ' కలం ' కారీ పనితనానికి దిగారు. వినోదావారి "శాంతి" చిత్రంలో చిన్నసముద్రాల పాటలు రాశారు. అప్పుడే జూనియర్ గా పేరుపడ్డారు. ఒకవైపు తన తండ్రి సినీరచనా విన్యాసాలకు తోడ్పడుతూనే, తన శైలీ విన్నాణాన్నీ ప్రదర్శించుకునేవారు.

తండ్రిగారికీ అంత ఇష్టం లేకపోయినా ఇతరుల ఆకాంక్షలకి తల ఒగ్గి, రామానుజం సినిమా రచన చెయ్యడానికి ఉద్యమించాడు. నీ రాత ఎలా వుంటే అలా జరుగుతుంది. నీ యిష్టం! అన్నారు తండ్రిగారు. దాంతో ఆయన రచయితగానే ప్రవేశించాడు. వినోదావారు 'శాంతి' (1952) సినిమా మొదలు పెడుతూ రామానుజం చేత పాటలు రాయించారు. తర్వాత 'అమ్మలక్కలు' (1953)లోనూ, 'బ్రతుకు తెరువు' (1953)లోనూ పాటలు రాశాడు.

"బ్రతుకుతెరువు" సినిమా జూనియర్ సముద్రాలకు బతుకు తెరువు చూపించి, పాటల రచయితగా పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది. ఆ సినిమాలోని "అందమె ఆనందం.....ఆనందమె జీవిత మకరందం....." నభూతో నభవిష్యత్ గా నిలవడం జూనియర్ ఇంద్రజాలమే!

సముద్రాల జూనియర్ అని రాయడానికి సినిమావారికి మహా బద్ధకం. అందుకే టైటిల్ కార్డ్స్ లో ' సముద్రాల (జూ)' అని వేస్తుండేవారు. ఇలా చేసినప్పుడల్లా రామానుజాచార్యకు తిక్క రేగుతూ ఉండేది. "నాన్నగారి పేరు పక్కన 'సీ' అని వేసినా ఫరవాలేదు. ఇంగ్లీషులో సీ అంటే సముద్రమే. నా పేరు దగ్గర 'జూ' అంటే కుదురుతుందా చెప్పండి? నేను అక్కడినుంచి వచ్చానేమో అని ఎవరన్నా అనుకునే ప్రమాదం ఉంది కదండీ!" అని వాపోయేవారు. అయినా ఈ ' జూ ' బాధ తరచూ ఆయనకు తప్పేదికాదు.

జూనియర్ గారు సినిమాపాటల కెమిస్ట్రీ సులువుగానే అర్థం చేసుకోగలిగారు. సినిమాగీతాలు, సంభాషణల మీటర్ ను ఇట్టే పట్టేశారు. మాటలయినా, పాటలయినా క్షణాలమీద అత్యద్భుతంగా రాసిస్తేనే నిలబడతామని గ్రహించారు. అప్పటినుంచీ ఉరుకులూ పరుగులే!

యన్‌.టి.రామారావుకి- రామానుజం రికార్డిస్టుగా ఉన్నప్పట్నుంచీ తెలుసు. ఆయన సాహిత్యాభిలాష తెలుసు. పాటలు రాస్తున్న విషయమూ తెలుసు. అంచేత తను ప్రారంభిస్తున్న 'తోడు దొంగలు' (1954)కు రచన చెయ్యమని అడిగి ఆ సినిమాకి రాయించారు. అది రామానుజం మాటలు రాసిన తొలి సినిమా. దర్శకత్వ శాఖలో కూడా పనిచెయ్యాలని, ఆయన ఎన్‌.ఎ.టి.లో సెట్సు మీద కూడా పనిచేశాడు. రామానుజం రెండో సినిమా 'జయసింహ' (1955) జయ పతాకం ఎగరవేసినప్పట్నుంచి, రామానుజం 'సముద్రాల జూనియర్‌'గా మారి సంభాషణలు రాయడం మీదనే దృష్టి సారించాడు. 'పాండురంగ మహాత్మ్యం' (1957), 'మంచి మనసుకి మంచి రోజులు' (1958), 'శాంతి నివాసం' (1960), 'ఆత్మ బంధువు' (1962), 'ఉమ్మడి కుటుంబం' (1967) 'స్త్రీ జన్మ' (1967), 'తల్లా? పెళ్లామా?' (1970), 'శ్రీ రామాంజనేయ యుద్ధం' (1975) లాంటి 70 చిత్రాలకు పైగా రచన చేశాడు జూనియర్‌ సముద్రాల.

"నర్తనశాల" చిత్రములో కీచకుడి పాత్ర కోసం కొన్ని సంభాషణలు రాయాల్సివున్నా, అనారోగ్యం కారణంగా సీనియర్ సముద్రాల వల్ల కాలేదు. ఆ బాధ్యతను జూనియర్ తన భుజాలమీద వేసుకుని, అడిగిందే తడవుగా రాసిచ్చారు. వీటిని పలికిన కీచక పాత్రధారి ఎస్.వి.రంగారావు...రామానుజాచార్యను పొగడ్తల్లో ముంచెత్తడం సన్మానం కింద లెక్కే!

"ధరణికి గిరి భారమా (మంచిమనసుకు మంచిరోజులు) , కలనైనా నీ వలపే (శాంతినివాసం) , పయనించే ఓ చిలుకా (కులదైవం) , రావే ప్రేమలతా (పెళ్ళిసందడి) , శ్రీకర కరుణాలవాల (బొబ్బిలి యుద్ధం) , మనవి సేయవే (రేచుక్క - పగటిచుక్క) " పాటలు జూనియర్ సముద్రాల చిత్కళకు ప్రతిరూపాలు.

"పాండురంగ మహాత్మ్యము" లో ఆయన రాసిన "జయ కృష్ణా! ముకుందా! మురారీ!" గీతం అప్పట్లో 2 రికార్డులుగా, 4 సైడ్లుగా వెలువడింది. రికార్డులన్నింటినీ వేల వ్రక్కలు చేసింది. ' టైం లేదు ' అనుకునే నేటి తరం కూడా ఎన్ని సైడ్లు తీసుకున్నప్పటికీ ఈ పాటను అభిమానిస్తుండటం గొప్పల్లో గొప్ప.

"అందమె ఆనందం" పాట రాశానని తండ్రి రాఘవాచార్యకు చెప్పబోతే, "కీట్స్ 'A thing of beauty is joy for ever' ను తెలుగులోకి తిప్పిరాశావా ఏంటి" అని ఆయన సణిగారట! అక్కడే ఉన్న మరో పెద్దాయన కలుగజేసుకుని మనస్సు, ప్రేమ సార్వదేశికమైనవి, సార్వకాలికమైనవి అని సర్దిచెప్పి గండం గట్టెక్కించారట!......

"జయసింహ" చిత్రం జూనియర్ సముద్రాల విశ్వరూపాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాకి మాటా, పాటా ఆడుతూ పాడుతూ ఆయన కానిచ్చేశారు. "ఈనాటి ఈ హాయీ, కల కాదోయి, నిజమోయీ" అన్న పాట తెలుగుసినిమా యుగళగీతాల్లో ఎప్పటికీ ముందువరసలోనే ఉండే సత్తా ఉన్న పాట.

జూనియర్ సముద్రాల స్నేహశీలి, మృదుభాషి, మానవతావాది. అందరినీ ' బ్రదర్ ' అని సంబోధిస్తూ మాట్లాడేవారు. ఘంటసాలతో ' ఒరేయ్ ' అనుకునే స్నేహం ఉంది. పాటల ట్యూన్ల విషయంలో ఘంటసాల మాష్టారు, జూనియర్ గారు ఆడుకునే సరససల్లాపాలు చూసేవారికి చూడముచ్చట.

1940 నాటి గుంటూరు నవ్యకళాపరిషత్తులో అనిసెట్టి సుబ్బారావు, కుందుర్తి ఆంజనేయులు, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ లతో పాటు జూనియర్ కూడా సభ్యుడే. జూనియర్, సీనియర్ రాసిన పద్యాలు చక్రపాణిగారి ఆధ్వర్యంలో "కడలిపొంగులు" పేరుతో పుస్తకరూపం ధరించాయి.

వారు లేకున్నా వారి పాటలు నేటికీ తెలుగు లోగిళ్ళలో "ఊగేములే! తులతూగేములే!" అంటూ ఊసులాడుతున్నాయి. జూనియర్ సముద్రాల ఒడ్డుకు తెచ్చి పడేసిన మంచిముత్యాల సినీగీతాలు కోమల కవితాధారలుగా, మనోహర తారలుగా, మధుర సితారలుగా ఆంధ్రులను ఆనందింపజేస్తూనే ఉన్నాయి.

No comments:

Post a Comment